ఫ్యూచర్ పోలీసింగ్'పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సాంకేతికత, ఏఐ, డిజిటల్ దర్యాప్తుతో పోలీసింగ్లో సమూల మార్పులకు పిలుపు.. నేరాల నియంత్రణతో పాటు కన్విక్షన్ రేటు పెంపుపై ప్రత్యేక దృష్టి.. సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళల భద్రతకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశం..
విజయవాడ, జూలై 23 (వి10టివి):
ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థను 2047 నాటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో 'ఫ్యూచర్ పోలీసింగ్'కు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మూడు రోజుల ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సాంకేతికత, కృత్రిమ మేధ (AI), డిజిటల్ దర్యాప్తు, ఆధునిక శిక్షణతో పోలీసింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించాలని సూచించారు.
నేరాలు నమోదు చేయడమే కాకుండా నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. బలమైన సాక్ష్యాధారాలతో కేసులను ఫాస్ట్ట్రాక్ కోర్టులకు పంపించడం, ప్రతి కోర్టుకు పోలీసు అధికారిని సమన్వయ బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
రిట్రీట్లో సైబర్ నేరాలు, డీప్ఫేక్లు, క్రిప్టో మోసాలు, మహిళలు–చిన్నారుల భద్రత, డ్రోన్ ముప్పులు, రోడ్డు భద్రత, డిజిటల్ పోలీసింగ్, మానవ వనరుల అభివృద్ధి వంటి ఆరు కీలక అంశాలపై రూపొందించిన నివేదికలను సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు మొబైల్ యాప్లు, ఒక సమగ్ర వెబ్సైట్ను ప్రారంభించడంతో పాటు కీలక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ కూడా మారాలని పేర్కొన్న చంద్రబాబు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రతి పోలీసు సిబ్బందికి డిజిటల్ నైపుణ్యాలు అవసరమన్నారు. ఏఐ, సైబర్ క్రైమ్, డార్క్ వెబ్, డీప్ఫేక్ గుర్తింపు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని ఆదేశించారు.
డ్రగ్స్ నిర్మూలనపై నిరంతర పోరాటం కొనసాగించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాల నెట్వర్క్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే నేరస్థుల పట్ల కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
రిట్రీట్లో సమర్పించిన నివేదికల ఆధారంగా మూడు, ఐదు, పది సంవత్సరాల కాలపరిమితితో స్పష్టమైన లక్ష్యాలు, మైలురాళ్లతో కూడిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

