వచ్చే ఏడాదికి గిరిజన పాఠశాలలన్నింటికీ సొంత భవనాలు: మంత్రి లోకేష్
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10 లక్షల మంది విద్యార్థుల చేరిక ప్రభుత్వ స్కూళ్ల ముందు 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించడం విద్యారంగంలో కీలక మార్పు విలువలతో కూడిన విద్య, రాజకీయాలకు తావులేని విద్యాసంస్థలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
రంపచోడవరం, 24 జూలై 2026 (వి10టివి):
గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ వచ్చే ఏడాది నాటికి సొంత భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను మరమ్మతులు చేపడతామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు.
గత రెండేళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఎదుట 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించడం విద్యారంగంలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, విద్యార్థులే ప్రభుత్వ విద్యకు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. ప్రభుత్వ టెన్త్, ఇంటర్ టాపర్ల ఫొటోలతో తొలిసారి ప్రకటనలు ఇవ్వడం విద్యార్థుల ప్రతిభకు ఇచ్చిన గౌరవమని వివరించారు.
విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న మంత్రి, తల్లి ఆశీస్సులు, గురువు మార్గదర్శకత్వం జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో 'వన్ క్లాస్-వన్ టీచర్', 'లీప్' యాప్, 'నో బ్యాగ్ డే', స్మార్ట్ కిచెన్లు, విద్యార్థి కిట్లు వంటి పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో రాజకీయాలకు తావు లేకుండా విద్యాభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. పిల్లలకు ఆస్తుల కంటే నాణ్యమైన విద్యను అందించడమే గొప్ప పెట్టుబడి అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


