ఎల్నినో ఎఫెక్ట్.. రైతులూ అప్రమత్తం..! ఇష్టానుసారం పంటలు వేస్తే భారీ నష్టాలే..!
రికార్డు స్థాయిలో వేడెక్కుతున్న సముద్రాలు.. పెరుగుతున్న వాతావరణ అస్థిరత కరువు, నీటి కొరత ముప్పుతో పంటల ఎంపికలో జాగ్రత్తలు అవసరం శాస్త్రీయ సలహాలతోనే సాగు చేయాలని రైతులకు నిపుణుల సూచన
ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా 50 రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్రాలు మరింత వేడెక్కుతుండటంతో రానున్న రోజుల్లో వర్షపాతం అసమానంగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని చోట్ల అతివృష్టి, వేడి తరంగాలు, తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రైతులు నీటి లభ్యతను అంచనా వేయకుండా ఇష్టానుసారంగా పంటలు సాగు చేస్తే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక నీరు అవసరమయ్యే పంటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకే పంటల ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేస్తేనే ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

