కృష్ణలంక హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి కోసం సిట్ ప్రత్యేక విజ్ఞప్తి
ప్రధాన నిందితుడు గురివింద సురేష్ ఆచూకీ తెలిపితే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐటీ హామీ..

విజయవాడ ఆగస్టు 2 (వి 10టివి):విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గురివింద సురేష్ (ఏ-4) ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 107/2026కు సంబంధించిన ఈ కేసులో నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నందున, అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరింది. నిందితుడి ఫొటోలు, వివరాలను ప్రజలకు విడుదల చేసిన సిట్, సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
నిందితుడు సుమారు 40 సంవత్సరాల వయస్సు, సత్తెనపల్లెపురం, విజయవాడకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఎత్తు సుమారు 5 అడుగుల 8 అంగుళాలు, శరీరాకృతి సాధారణం, రంగు తెలుపు, గుండ్రని ముఖం, నలుపు-తెలుపు రంగు జుట్టు ఉన్నట్లు సిట్ తెలిపింది.
పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచిపెట్టడం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సహకరించడం చట్టరీత్యా నేరమని ఎస్ఐటీ హెచ్చరించింది. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరింది.
