'ఏపీ అస్త్రం' యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్
మొగల్రాజపురం జూడియో వద్ద అవగాహన కార్యక్రమం వాహనదారులు, కొనుగోలుదారులతో యాప్ డౌన్లోడ్ చేయింపు ప్రజల భద్రతకు ఉపయోగపడే సాంకేతిక వేదికగా 'ఏపీ అస్త్రం'

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ): రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని విజయవాడ ట్రాఫిక్ సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మొగల్రాజపురంలోని జూడియో షోరూమ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ లోవరాజుతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన 'ఏపీ అస్త్రం' యాప్ ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడే విధంగా రూపొందించబడిందన్నారు. ట్రాఫిక్ సమాచారం, అత్యవసర ఎస్ఓఎస్ సేవలు, పోలీసులకు ఫిర్యాదులు అందించడం, భద్రతకు సంబంధించిన సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించబడిందని తెలిపారు. సాంకేతికతను ప్రజల భద్రత కోసం వినియోగించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడు, ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రజలు పోలీసు శాఖతో మరింత సులభంగా అనుసంధానం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఆర్ఎస్ఐ లోవరాజు వాహనదారులు, కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడి వారి మొబైల్ ఫోన్లలో 'ఏపీ అస్త్రం' యాప్ను డౌన్లోడ్ చేయించి, దాని వినియోగ విధానాన్ని వివరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
