P-4తో పేద కుటుంబాలకు ఉపాధి భరోసా
రూ.66 లక్షలతో 115 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక... ఆరు బంగారు కుటుంబాలకు ఆటోలు, యంత్ర సామగ్రి పంపిణీ... పేదరికం నుంచి ఎదిగేందుకు మార్గం చూపుతున్న విజనరీ సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 3: పేద కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం అందించడంతో సరిపెట్టకుండా, వారు తమ కాళ్లపై తాము నిలబడి స్థిరమైన ఆదాయం పొందేలా చేయడమే P-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పేదరికం నుంచి కుటుంబాలు బయటపడేందుకు P-4 ద్వారా మార్గం చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడని కొనియాడారు.
గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం P-4 ప్రాజెక్టులో భాగంగా ‘ఫ్రీ గ్రౌండ్ మీటింగ్ విత్ బంగారు కుటుంబాలు–అసెట్స్ డిస్ట్రిబ్యూషన్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నేతృత్వంలో నిర్వహించారు. P-4 ఆరో దశలో రూ.66 లక్షలతో 115 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఆరు బంగారు కుటుంబాలకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా స్వయం ఉపాధి పొందేందుకు ఆటోలు, వివిధ రకాల యంత్ర సామగ్రిని ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. దాతలు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో తొలి అడుగు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని, దారిలేని చోట వేసే తొలి అడుగే భవిష్యత్ తరాలకు మార్గం చూపుతుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు P-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.


నైపుణ్యం ఉన్నప్పటికీ అవకాశాలు లేక పేదరికంలోనే మిగిలిపోతున్న కుటుంబాలకు ఉపాధి సాధనాలు అందించి స్థిరమైన ఆదాయ మార్గం కల్పించాలన్నారు. “సహాయం పొందిన కుటుంబం రేపు మరో కుటుంబానికి సహాయం చేసే స్థాయికి ఎదగడమే P-4 అసలు ఉద్దేశం” అని పేర్కొన్నారు.
గుడ్లవల్లేరు ప్రాంత అభివృద్ధితో పాటు P-4 ద్వారా వందలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తున్న మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయం నిజంగా అవసరమైన కుటుంబాలకు చేరేలా అధికారులు, P-4 బృందం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, ఎంపీడీవో ఇమ్రాన్, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, P-4 ప్రాజెక్టు మేనేజర్ చింతయ్యతో పాటు కూటమి నాయకులు, మేఘా సంస్థ ప్రతినిధులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

