దుర్గమ్మకు రూ.21 లక్షల బంగారు హారం
అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల పూసల రాధాకృష్ణుల హారం సమర్పణ... సీతారామపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబం భక్తిశ్రద్ధలతో విరాళం... దేవాలయ మర్యాదలతో దాతలను సత్కరించిన ఆలయ అధికారులు...

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీ బంగారు ఆభరణాన్ని విరాళంగా అందజేశారు. విజయవాడ సీతారామపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బంగారు పూసల రాధాకృష్ణుల హారాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ఈ బంగారు హారం అంచనా విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. అమ్మవారిపై భక్తితో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి దేవాలయ మర్యాదలతో సత్కరించారు.
కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామప్రసాద్, సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

