జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి గర్హనీయం
ఇసుక అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే దాడి జరిగిందని ఆరోపణ... దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇసుక దందాలపై సమగ్ర విచారణ జరపాలి... నాగార్జున రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం డిమాండ్...

విజయవాడ: చీరాలకు చెందిన జర్నలిస్ట్ నాయుడు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడేనని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది.
జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.వి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందిళ్లపల్లి ప్రాంతంలోని ఇసుక క్వారీల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందంటూ గతంలో నాగార్జున రెడ్డి వార్తలు ప్రచురించారని తెలిపారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
గత వారంలో నాగార్జున రెడ్డి ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారని, తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. దాడి వెనుక ఉన్నవారిని గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
అక్రమ ఇసుక క్వారీలకు సంబంధించిన అంశంపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన నాగార్జున రెడ్డిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆయన భార్య ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించినప్పటికీ, ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.
ప్రస్తుతం నాగార్జున రెడ్డి చీరాల ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు నాణ్యమైన, మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇసుక అక్రమ రవాణాపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

