స్థానిక ఎన్నికల షెడ్యూల్పై వైరల్ ప్రచారం ఫేక్: ఏపీ ఎస్ఈసీ
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవే... ఎన్నికల సంఘం పేరు, లోగోను అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు... తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు.. షేర్ చేయొద్దు: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా...

అమరావతి, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. వాట్సాప్తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్కు సంబంధించిన సమాచారం నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ ప్రకటించకముందే, ఎన్నికల తేదీలు ఖరారైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఇటువంటి సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం కూడా మానుకోవాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం పేరు, అధికారిక లోగోను అనుమతి లేకుండా ఉపయోగించి నకిలీ ప్రకటనలు రూపొందించడం చట్టరీత్యా నేరమని అనిల్ చంద్ర పునేఠా హెచ్చరించారు. ఎన్నికల సంఘం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు సమాచారం, అసత్య వార్తలను ప్రచారం చేసే వారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీలు, షెడ్యూల్ సహా అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం ప్రకటనల ద్వారానే నిర్ధారించుకోవాలని ప్రజలు, మీడియాకు సూచించారు.
“అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు.. షేర్ చేయవద్దు. ఎన్నికల సంఘం పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

