సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష
రైతులకు అండగా దీక్షలో పాల్గొన్న ఉప్పాల రాము, ఉప్పాల హారిక. నీరు విడుదల చేయకపోతే మహా పాదయాత్ర, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతుల డిమాండ్.


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గూడూరు (కృష్ణాజిల్లా), ఆగస్టు 6: రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు మెయిన్ సెంటర్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పెడన నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉప్పాల రాము, కృష్ణాజిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మద్దతు తెలిపారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ, ఏరువాక సందర్భంగా రైతులను సాగుకు ప్రోత్సహించిన ప్రభుత్వం, అనంతరం సాగునీటికి నీరు లేదని ప్రకటించడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. సాగునీటి అంశంపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్య

పరిష్కారం కాకపోతే గూడూరు తర్వాత పెడన, బంటుమిల్లి, కృతివెన్నులో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 10న పెడనలో భారీ ర్యాలీ చేపడతామని, అయినా స్పందన లేకుంటే పల్లిపాలెం నుంచి గుడ్లవల్లేరు వరకు మహా పాదయాత్ర ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రకాశం బ్యారేజ్ వరకు పాదయాత్ర కొనసాగించి, చివరి దశలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రైతుల తరఫున ముఖ్యమంత్రితో మాట్లాడి పెడన నియోజకవర్గానికి వెంటనే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప్పాల రాము కోరారు. కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

