అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి: కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఫారం-6తో యువత ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచన సెప్టెంబర్ 28 నాటికి అన్ని దరఖాస్తుల పరిష్కారం

నందిగామ, ఆగస్టు 6 (వి10టివి): అర్హులైన ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని, ఓటరుగా నమోదు కావడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నందిగామలో పరిశీలించిన కలెక్టర్, బీఎల్వోలు ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం స్వీకరించి సకాలంలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై 31న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత బీఎల్వోను సంప్రదించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు. ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం సెప్టెంబర్ 28 నాటికి అన్ని క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువకుడు, యువతి ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో ఎ. అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, ఎంపీడీవో వరప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

