విజయేశ్వరుడి సన్నిధిలో కొత్త పాలకవర్గం
ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న... భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట... బుద్ధా భూలక్ష్మి పేరుతో రూ.50 వేల విరాళం ప్రకటించిన బుద్ధా వెంకన్న...

విజయవాడ, ఆగస్టు 26: విజయేశ్వర స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా, అభివృద్ధిపరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న సూచించారు. విజయేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీ చిన్ని, బుద్ధా వెంకన్నతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉందన్నారు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేలా నూతన కమిటీ పనిచేయాలని, ఆలయ నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. విజయేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన సతీమణి బుద్ధా భూలక్ష్మి పేరుతో రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు.
నూతన కమిటీ చైర్మన్ దరిసి సీత మహాలక్ష్మి మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కమిటీ సభ్యులందరితో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, నాగవంశీల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ, జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకుడు అడ్డూరి శ్రీరామ, కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

