గర్భిణీల గుండె ఆరోగ్యానికి ‘సుజనా’ భరోసా
చిట్టినగర్లో నాలుగో విడత ఉచిత 2డీ ఎకో స్క్రీనింగ్ క్యాంపు... 16 మంది గర్భిణీలకు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ పరీక్షలు... పేదల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం...

విజయవాడ, ఆగస్టు 25: గర్భిణీల్లో గర్భధారణ సమయంలో తలెత్తే గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రాణాంతక పరిస్థితులను నివారించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది.
చిట్టినగర్లోని సర్కిల్–1 కార్యాలయం వద్ద మంగళవారం నాలుగో విడత ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరంలో మొత్తం 16 మంది గర్భిణీలకు 2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
గర్భధారణ సమయంలో మహిళల గుండెపై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, గుండె సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు వివరించారు. సకాలంలో సమస్యను గుర్తించడం ద్వారా అవసరమైన వైద్య చికిత్స, జాగ్రత్తలు తీసుకుని తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణీలపై వైద్య పరీక్షల ఆర్థిక భారం పడకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను ఉచితంగా వారి ముంగిటకే తీసుకురావడమే సుజనా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
శిబిరంలో డాక్టర్ విజయ్ సుధా, 2డీ ఎకో టెక్నీషియన్ కుసుమ వైద్య సేవలు అందించారు. పరీక్షలకు వచ్చిన గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నాగోతి రామారావు, వేంపలి గౌరీశంకర్, పోతినిడి లోకేష్, బి. దుర్గారావు, వై. ఆనంద్, జి. వాసు, యూపీహెచ్సీ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని సేవలందించారు.

