రైతుల కోసం రివర్స్లో నీటి ఎత్తిపోత
లక్ష్మీపురం లాకుల వద్ద భారీ మోటార్లతో డ్రెయిన్ నీరు రైవస్ కాలువలోకి... రూ.50 లక్షలతో మోటార్లు ఏర్పాటు చేసిన ఆక్వా రైతులు... రైతులకు అండగా ఉంటాం: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్...

కృత్తివెన్ను, ఆగస్టు 29: సాగునీరు, ఆక్వా సాగుకు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరటనిచ్చేలా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకుల వద్ద వినూత్న చర్య చేపట్టారు. కొల్లేరు ప్రాంతం నుంచి వస్తున్న డ్రెయిన్ నీటిని భారీ మోటార్ల సహాయంతో నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో బంటుమిల్లి రైవస్ కాలువలోకి ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ (APIC) చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజుతో కలిసి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
నీటి కొరత కారణంగా సాగు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యకు పరిష్కారం చూపేందుకు రైతులే ముందుకొచ్చారు. లక్ష్మీపురం లాకుల వద్ద డ్రెయిన్ నీటిని రైవస్ కాలువలోకి ఎత్తిపోసేందుకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో భారీ మోటార్లను ఏర్పాటు చేశారు.
ఈ మోటార్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సదుపాయం కోసం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ చొరవ తీసుకుని రెండు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సహకరించారు. అనంతరం భారీ మోటార్లను ప్రారంభించి డ్రెయిన్ నీటిని రైవస్ కాలువలోకి ఎత్తిపోశారు. దీంతో కాలువలో నీటి ప్రవాహం పెరిగి ఆక్వా చెరువులకు అవసరమైన నీరు అందే అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం తన బాధ్యతని పేర్కొన్నారు. నీటి కొరత కారణంగా రైతులు నష్టపోకుండా సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సమస్య పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ముందుకొచ్చి రూ.50 లక్షలతో భారీ మోటార్లు ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

