గిఫ్ట్ ఉచితం.. కానీ క్లిక్ చేస్తే భారీ మూల్యం!
‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’ అంటూ నకిలీ సందేశాలు... ఫ్రీ గిఫ్ట్, క్యాష్బ్యాక్ లింకులను క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక... వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం దొంగిలించే ప్రమాదం...

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’, ‘ఫ్రీ గిఫ్ట్’, ‘క్యాష్బ్యాక్’ అంటూ వాట్సాప్ తదితర మాధ్యమాల్లో నకిలీ లింకులను పంపుతూ వినియోగదారులను బుట్టలో వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయడం వల్ల మొబైల్లోని కీలక సమాచారం, బ్యాంకింగ్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గిఫ్ట్, క్యాష్బ్యాక్ సందేశాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

