ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను మార్చొద్దు: ఏపీ
▪️ బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ బలమైన వాదనలు... ▪️ కృష్ణా డెల్టా, కేసీ కాలువ, నాగార్జునసాగర్లో కొత్తగా నీటి ఆదాకు అవకాశం లేదని స్పష్టం... ▪️ బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను రక్షించాలి.. మిగులు ఉంటేనే కొత్త ప్రాజెక్టులకు నీరు...

అమరావతి, ఆగస్టు 14: కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను తిరగదోడటానికి వీల్లేదని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని నిబంధనల ప్రకారం ఇప్పటికే పరిష్కారమైన అంశాలను తిరిగి ప్రస్తావించకూడదని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు.
శాస్త్రీయ పంట నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా డెల్టా, కేసీ కాలువ, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే నీటి ఆదా సాధించామని, ఇక కొత్తగా వీటి కింద అదనపు నీటిని ఆదా చేసే అవకాశం లేదని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు.
నీటి కేటాయింపులకు కేవలం పరీవాహక ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఏపీ వాదించింది. గత నీటి వినియోగం, కరవు పరిస్థితులు, ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, దీర్ఘకాలంగా వాటిపై ఆధారపడుతున్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులతో పాటు కృష్ణా తొలి ట్రైబ్యునల్ నిర్దిష్ట ప్రాజెక్టులకు చేసిన నీటి కేటాయింపులను కొనసాగించాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు లేని పక్షంలో రెండు రాష్ట్రాల్లోని ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని పేర్కొంది.
రాష్ట్ర విభజన చట్టం–2014లోని షెడ్యూలు 11 ప్రకారం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు ముందుగా నీటి కేటాయింపులను పరిరక్షించాలని, ఆ తర్వాత నీరు అందుబాటులో ఉంటేనే కొత్త, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని ఏపీ కోరింది.
అదనపు అంశాలపై తెలంగాణ చేసిన వాదనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తన వాదనలను గురువారంతో ముగించింది. ఏపీ వాదనలపై తెలంగాణ ప్రతివాదనలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి.

