మాతృభాష పరిరక్షణకు విద్యావ్యవస్థలో మార్పులు అవసరం: యార్లగడ్డ
పదో తరగతిలో తెలుగులో 37,679 మంది ఫెయిల్ కావడం ఆందోళనకరం... తెలుగులోనూ అత్యధిక మార్కులు సాధించేలా బోధన, పరీక్షా విధానంలో సంస్కరణలు తేవాలి.... విద్యావేత్తలు, తెలుగు ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు...

అమరావతి ఆగస్టు 18 (V10TV AP): మాతృభాష తెలుగును పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలంటే విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను అభినందించారు. తెలుగు భాష అభివృద్ధికి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రతో పాటు ఏఐ ఆధారిత విద్య, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ బోధన వంటి సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు.
అయితే విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నా చదవడం, రాయడంలో వెనుకబడటం ఆందోళనకరమన్నారు. పదో తరగతి పరీక్షల్లో తెలుగులో 37,679 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం మాతృభాష బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందన్నారు.
గణితం, సైన్స్ మాదిరిగానే తెలుగులోనూ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేలా ప్రశ్నపత్రాలు, పరీక్షా విధానాన్ని రూపొందించాలని సూచించారు. క్లిష్టమైన వ్యాకరణం, పద్యాలకే పరిమితం కాకుండా గిడుగు రామమూర్తి పంతులు సూచించిన వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యావేత్తలు, తెలుగు ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బోధనా విధానంలో అవసరమైన మార్పులను అధ్యయనం చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు భాష, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

