ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..!
సంచుల నిండా కట్టల కట్టలుగా నగదు... ఆయుధాల కోసం సోదాలు చేస్తే బయటపడిన భారీ మొత్తం... ఐదు గంటలు లెక్కించి రూ.3 కోట్ల నగదు స్వాధీనం...

సాగర్, ఆగస్టు 18: మధ్యప్రదేశ్లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో ఏకంగా రూ.3 కోట్ల నగదు బయటపడటం కలకలం రేపింది. ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఆయుధాల జాడ కనిపించలేదు. కానీ సంచుల నిండా కట్టల కట్టలుగా నగదు కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
సాగర్లోని గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల తుపాకీతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. దీంతో అతని వద్ద ఆయుధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇంట్లో ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే తనిఖీల్లో భారీగా నగదు ఉన్న సంచులు బయటపడ్డాయి. ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు నగదు లెక్కింపు యంత్రాలను తెప్పించారు. సుమారు ఐదు గంటల పాటు లెక్కించగా మొత్తం రూ.3 కోట్లుగా తేలినట్లు సమాచారం.
నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంత భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఆ నగదుతో తమకు సంబంధం లేదని, భోపాల్లో ప్రభుత్వ ఇంజనీర్గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబానికి చెందినదని వారు చెప్పినట్లు సమాచారం.
అయితే రూ.3 కోట్ల నగదు ఆటో డ్రైవర్ ఇంటికి ఎందుకు వచ్చింది? దాని అసలు యజమాని ఎవరు? నగదుకు సంబంధించిన లెక్కలు, ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

