మృత్యుఘోషపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
ప్రైవేటు బస్సు–ఆటో ఢీ ఘటనలో ఏడుగురి మృతిపై తీవ్ర విచారం... క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం... ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని స్పష్టీకరణ...

అమరావతి, ఆగస్టు 27: పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
ప్రమాద వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారు ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడినట్లు తాజా పోలీసు సమాచారం వెల్లడించింది. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సమగ్ర తనిఖీలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల భద్రతా ప్రమాణాలు, నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
