విజయవాడలో శానిటైజర్ దందా.. మెడికల్ షాపులపై డ్రగ్ అధికారుల కొరడా!
బిల్లులు లేకుండానే వేలాది శానిటైజర్ బాటిళ్ల విక్రయం... మూడు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు.. కాలం చెల్లిన మందులూ గుర్తింపు... మత్తు కోసం శానిటైజర్ వినియోగిస్తే ప్రాణాలకే ముప్పు అంటూ అధికారుల హెచ్చరిక...

విజయవాడ, ఆగస్టు 28: నగరంలోని మెడికల్ షాపుల్లో శానిటైజర్ విక్రయాలపై అనుమానాలు తలెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. పటమటలోని రెండు దుకాణాలు, గవర్నర్పేటలోని మరో మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.
తనిఖీల్లో 100 ఎంఎల్ సామర్థ్యం కలిగిన సుమారు 34 వేల శానిటైజర్ బాటిళ్లకు సంబంధించిన విక్రయాల్లో బిల్లులు లేనట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో బాటిల్ విలువ రూ.50 చొప్పున వీటి మొత్తం విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని వెల్లడైంది. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సుమారు 33 వేల బాటిళ్లు సరైన బిల్లులు లేకుండా విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన మందులను కూడా తనిఖీల్లో గుర్తించారు.
శానిటైజర్ను చేతుల పరిశుభ్రత వంటి నిర్దేశిత అవసరాలకే వినియోగించాలని అధికారులు సూచించారు. మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్ను సేవించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చర్యలు తీసుకుంటామని, నగరంలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు.

