మత్తు దందాపై ఖాకీ ఉక్కుపాదం
సత్యనారాయణపురాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యం మత్తు దందాపై సమాచారం ఇచ్చేవారి వివరాలు పూర్తి గోప్యం: సీఐ లక్ష్మీనారాయణ పూర్ణానందంపేట, పెజ్జోనిపేట, రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిరంతర పోలీసు నిఘా

విజయవాడ, ఆగస్టు 24: సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిని గంజాయి, డ్రగ్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు నిరంతర నిఘాతో పాటు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు. సోమవారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి గురించి ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం అందించి మత్తు పదార్థాల విక్రయదారులను పట్టించేందుకు సహకరించే వారికి తగిన నగదు బహుమతి అందించేలా చర్యలు ఉంటాయని తెలిపారు. స్టేషన్ పరిధిలోని పూర్ణానందంపేట, పెజ్జోనిపేటతో పాటు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఐ పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి విక్రయం లేదా వినియోగం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల సరఫరా గొలుసును అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, అనుమానాస్పద స్నేహాలు, మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. “సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, డ్రగ్స్కు చోటు లేకుండా చేయడమే మా లక్ష్యం. మత్తు పదార్థాల విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలు ధైర్యంగా ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం” అని సీఐ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
