మూడు వారాల్లో గన్నవరం–పుట్టగుంట రోడ్డు పూర్తి
పనుల్లో జాప్యానికి ఇక తావులేదు: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు... అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు తక్షణమే మార్చాలని ఆదేశం... రోడ్డు పూర్తయితే ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలకు సులభతరమైన రాకపోకలు...

గన్నవరం, ఆగస్టు 27: గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి నిర్మాణ పనులను మరో మూడు వారాల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. దావాజీగూడెం రహదారి పనుల పురోగతిపై గన్నవరం కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రహదారి నిర్మాణంలో ఇకపై ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పనులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లను అత్యవసరంగా పక్కకు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు రహదారి పనుల ఆలస్యానికి గల కారణాలను ఎమ్మెల్యేకు వివరించారు. తారు ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగిందని, దీంతో సవరించిన అంచనాలకు పరిపాలనా ఆమోదం పొందాల్సి రావడం వల్ల పనుల్లో ఆలస్యం చోటుచేసుకున్నట్లు తెలిపారు.
అయితే పరిపాలనా కారణాలు ఇకపై పనులకు అడ్డంకిగా మారకూడదని యార్లగడ్డ స్పష్టం చేశారు. మూడు వారాల్లో రహదారి పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి పూర్తయితే ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని యార్లగడ్డ తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

