నిరుపేదల వైద్యానికి రూ.31.64 లక్షల ఎల్ఓసీలు
ముగ్గురు బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక భరోసా... ఇద్దరు నవజాత శిశువుల చికిత్సకు రూ.28.41 లక్షల ఎల్ఓసీలు... ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి...

విజయవాడ, ఆగస్టు 24: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముగ్గురు బాధితులకు మొత్తం రూ.31.64 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు.
51వ డివిజన్ కొత్తపేటకు చెందిన బి. సాయి లహరి (24)కు జన్మించిన ఐదు రోజుల నవజాత శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో అత్యవసర వైద్య చికిత్స కోసం ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో రూ.8.45 లక్షల ఎల్ఓసీ మంజూరు కాగా, ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా 45వ డివిజన్కు చెందిన గుండు సుమాంజలి (32)కు నెలలు నిండకుండానే జన్మించిన రెండు రోజుల నవజాత శిశువుకు మెరుగైన వైద్యం అవసరమైంది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకోగా రూ.19.96 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. దీంతో శిశువుకు అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.
54వ డివిజన్ కొత్తపేటకు చెందిన గూడెల శ్రీనివాసరావు (54) మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన చికిత్స నిమిత్తం రూ.3.23 లక్షల ఎల్ఓసీ మంజూరు కాగా, కూటమి నేతలు సంబంధిత పత్రాలను అందజేశారు.
వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తులపై త్వరితగతిన స్పందించి ఎల్ఓసీలు మంజూరయ్యేలా చొరవ చూపిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, షేక్ హబీబుల్లా, సుజనా న్యాయమిత్ర బాయన హేరంబ కుమార్, బొమ్ము రాంబాబు, దేవిన హరిప్రసాద్, కరిముల్లాతో పాటు సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

