గూడూరు పోలీసుల చాకచక్యం.. దొంగతనం కేసు ఛేదింపు!
ఇద్దరు నిందితుల అరెస్ట్.. సుమారు 3.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం... అంజనేయస్వామి వెండి ఉత్సవ విగ్రహంతో పాటు మోటార్సైకిల్ సీజ్... ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపైనా పోలీసుల ఆరా...

మచిలీపట్నం ఆగస్టు 18 (V10TV AP): కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 3.5 కిలోల వెండి వస్తువులతో పాటు దొంగతనానికి ఉపయోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గూడూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 142/2026గా నమోదైన కేసులో బీఎన్ఎస్-2023లోని సెక్షన్లు 331(4), 305(d), 305(a) కింద దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేకంగా దృష్టి సారించిన పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి సుమారు 3.5 కిలోల వెండి వస్తువులు, వెండి ఆభరణాలు, వెండి ప్లేట్లు, అంజనేయస్వామి వెండి ఉత్సవ విగ్రహంతో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఇదే తరహా దొంగతనాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కారంచేడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 03/2026, అమర్తలూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 65/2026, నల్లపాడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 393/2026 కేసుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

