రూ.2.20 కోట్లు, స్కార్పియో ఇచ్చి మోసపోయా!
బీజేపీ నేత పత్రి శ్రీనివాస్పై హైదరాబాద్ వైద్యుడు కేశవరావు తీవ్ర ఆరోపణలు... స్థలం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చానంటూ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన... డబ్బులు అడిగితే పలుకుబడి పేరుతో బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన...

విజయవాడ ఆగస్టు 18 (V10TV AP): స్థలం కొనుగోలు వ్యవహారంలో తన నుంచి రూ.2.20 కోట్లతో పాటు స్కార్పియో వాహనం తీసుకుని మోసం చేశారంటూ పత్రి శ్రీనివాస్ అనే వ్యక్తిపై హైదరాబాద్కు చెందిన వైద్యుడు కేశవరావు తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ విజయవాడలోని శ్రీనివాస్ నివాసం ఎదుట ఆయన నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ కేశవరావు.. శ్రీనివాస్ను బీజేపీ నాయకుడిగా నమ్మి తాను మోసపోయానని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో విజయవాడలో స్థలం కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఇందుకోసం తాను వడ్డీకి సైతం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఈ వ్యవహారంలో తనకు రూ.2.20 కోట్లతో పాటు స్కార్పియో వాహనం కూడా రావాల్సి ఉందని కేశవరావు పేర్కొన్నారు. గత ఏడాది నుంచి తనకు రావాల్సిన సొమ్ము తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరుతున్నప్పటికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. డబ్బులు అడిగినప్పుడల్లా రాజకీయ పలుకుబడి ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ అగ్రనేతల అండదండలు తమకు ఉన్నాయని, పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని చెబుతూ తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేశవరావు ఆరోపించారు. హైదరాబాద్లోనూ పలువురితో శ్రీనివాస్కు ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తనకు ఆ తర్వాత తెలిసిందని పేర్కొన్నారు.
తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తినని, కష్టపడి సంపాదించిన సొమ్ముతో భవిష్యత్తులో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టానని కేశవరావు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.
తనకు న్యాయం జరిగే వరకు శ్రీనివాస్ నివాసం ఎదుట నుంచి కదిలేది లేదని, అవసరమైతే కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కేశవరావు స్పష్టం చేశారు.
కాగా, డాక్టర్ కేశవరావు చేసిన ఆరోపణలపై పత్రి శ్రీనివాస్ వివరణ తెలియాల్సి ఉంది. ఆరోపణల నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
