అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం!
కండరాల వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల పవన్ కిషోర్కు కలెక్టర్ రాజాబాబు భరోసా... రూ.26 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ అవసరమని వైద్యుల వెల్లడి... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చర్యలు చేపడతామన్న కలెక్టర్...

ఒంగోలు ఆగస్టు18(V10TV AP):అరుదైన కండరాల అసాధారణ పెరుగుదల వ్యాధితో బాధపడుతూ వీల్చైర్కే పరిమితమైన 11 ఏళ్ల బాలుడు వల్లెపు పవన్ కిషోర్కు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు భరోసా ఇచ్చారు.
సంతమాగులూరు మండలం కొప్పెరం గ్రామానికి చెందిన పవన్ కిషోర్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి బాలుడిని తీసుకొచ్చారు. ఆరేళ్ల వయసులోనే అరుదైన వ్యాధి బారిన పడిన తమ కుమారుడికి వయసుకు మించి అసాధారణంగా కండరాలు పెరుగుతున్నాయని వారు కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం తన పనులు తాను చేసుకోలేని స్థితికి చేరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలుడి వైద్యం కోసం తమ స్థాయికి మించి ఇప్పటికే సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో చలించిపోయిన కలెక్టర్ రాజాబాబు బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు నుంచి వివరాలు తెలుసుకున్నారు.
జన్యులోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, చికిత్సలో భాగంగా సుమారు రూ.26 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమవుతుందని వైద్యాధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలుడి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ అందించే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. “అధైర్య పడొద్దు.. ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయం అందేలా చూస్తాం” అంటూ పవన్ కిషోర్ తల్లిదండ్రులకు కలెక్టర్ రాజాబాబు భరోసా ఇచ్చారు.

