స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లైనా దళితవాడల్లో మార్పేది?: పుష్పరాజ్
దళితవాడలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని ఆవేదన... కనీస సౌకర్యాల కోసం దళితులు ఉద్యమించాల్సిన పరిస్థితి: నన్నేటి పుష్పరాజ్... హామీలతో కాలం గడిపే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరిక...

ఆగస్టు 15 — V10TV AP: స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడిచినా దళితవాడల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆచంట నియోజకవర్గ అధ్యక్షుడు కుసుమే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మారుతున్నా దళితవాడల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు వంటి కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న పాలకులు అనంతరం దళితవాడల అభివృద్ధిని విస్మరిస్తున్నారని విమర్శించారు.
దళితుల సమస్యల పరిష్కారం కోసం బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మేలు చేస్తాయని నమ్మి ఓటేస్తే కొన్ని రాజకీయ పార్టీలు వారి ఆశలను వమ్ము చేస్తున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో దళితుల సమస్యలను పట్టించుకోని పార్టీలకు మాల మహానాడు తరఫున తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో కప్పల నాగేంద్రబాబు, మాత వెంకటేశ్వర్లు, మల్లెపూడి బుజ్జిబాబు, మురాల ధర్మరాజు, పలివేల ప్రేమ్కుమార్, గుంటూరు నరేష్, పిల్లి ప్రాన్సిపాల్, పిల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

