ఆలయ అభివృద్ధికి పాలకమండలి పాటుపడాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి
భక్తులకు మెరుగైన సేవలు అందించేలా నూతన పాలకవర్గం పనిచేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే: సుజనా చౌదరి నగరాల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 21 (ఆంధ్రప్రభ): ఆలయ అభివృద్ధికి నూతన పాలకమండలి సభ్యులు సమష్టిగా పాటుపడాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) సూచించారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన పోతిన భేసు కంటేశ్వరుడితో పాటు పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న, ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ నియమ నిబంధనలను పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నగరాల కులస్తుల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తున్నానని తెలిపారు. ప్రజల


జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. ‘‘ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం’’ అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చి, డిమాండ్ చేసి మరీ చేయించుకోవాలని సూచించారు. నగరాల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎంపీ చిన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ సమాజ సేవలో భాగస్వాములవుతున్న నగరాల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులను అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు మరుపిళ్ల చిట్టి ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. చిట్టినగర్ సెంటర్లోని ఆయన విగ్రహాన్ని మరింత ఘనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జి, బాయన వెంకట్రావు, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, చెన్నుపాటి శ్రీనివాస్, బొమ్మసాని సుబ్బారావు, గుజ్జారీ అమర్, కరణం దివాకర్, సుకాసి కిరణ్, సుకాసి సరిత తదితరులు పాల్గొన్నారు.

