గర్భిణీల గుండెకు ‘సుజనా’ భరోసా
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత 2డీ ఎకో పరీక్షలు చిట్టినగర్లో 28 మంది గర్భిణీలకు కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పేద, మధ్యతరగతి మహిళల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు

విజయవాడ: పేద, మధ్యతరగతి గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని ‘సుజనా ఫౌండేషన్’ నిర్వహిస్తున్న మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్లోని సర్కిల్ వన్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ఉచిత హెల్త్ స్క్రీనింగ్ శిబిరాన్ని స్థానిక గర్భిణీలు సద్వినియోగం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరంలో మొత్తం 28 మంది గర్భిణీలకు 2డీ ఎకో–మెటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో మహిళల్లో తలెత్తే గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వైద్య సిబ్బంది తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్యాధునిక పరీక్షలకు దూరమవుతున్న పేద, మధ్యతరగతి మహిళలకు ఎటువంటి ఖర్చు లేకుండా వారి ప్రాంతంలోనే డయాగ్నస్టిక్ సేవలు అందించడమే సుజనా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. డాక్టర్ విజయ్ సుధా, 2డీ ఎకో టెక్నీషియన్ షారోన్ గర్భిణీలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. శిబిరంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, యూపీహెచ్సీ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. కూటమి నేతలు వేంపలి గౌరీశంకర్, నాగోతి రామారావు, ఆకారపు విజయకుమారి తదితరులు సేవలందించారు.

