అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత అఫీఫా అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన కుటుంబ సభ్యులను ఓదార్చి.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
వీ10టీవీ – విజయవాడ: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని షిరీన్ బేగం నివాసానికి వెళ్లిన హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు. కుమార్తెను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న షిరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. చీరాల బీచ్కు వెళ్తుండగా ఏటుకూరు

బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో 24 ఏళ్ల అఫీఫా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా పూడ్చలేని లోటు.. తీరని వేదన’’ అని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తీరుతో పాటు గాయపడిన వారి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అఫీఫా మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన అనిత, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోస్థైర్యాన్ని భగవంతుడు షిరీన్ బేగం కుటుంబానికి ప్రసాదించాలని ఆకాంక్షించారు.

