ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగుల ర్యాలీ
ఆగస్టు 17 నుంచి 20 వరకు ఉద్యోగ సాధన దీక్షలు... 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్... యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగుల విజ్ఞప్తి...

విజయవాడ, ఆగస్టు 19: ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగులు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఐటీ (మీ) సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగ సాధన దీక్షలు చేపట్టారు.
పటమట రైతుబజార్ నుంచి ESD కార్యాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను పునరుద్ధరించాలని కోరుతూ డైరెక్టర్ శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.
తమ కుటుంబాల జీవనాధారం ఉద్యోగాలపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఉద్యోగాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఏపీ నాగేశ్వరరావు, సీహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

