కష్టంలో కూలీ కుటుంబం.. కదిలిన ఖాకీ హృదయం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దంపతులకు సత్యనారాయణపురం పోలీసుల ఆపన్నహస్తం... నవజాత శిశువుతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి రూ.10 వేల సాయం... ఆహారం, చిన్నారి పాల ఖర్చులు అందించి స్వగ్రామానికి రైలు ఎక్కించిన పోలీసులు...

విజయవాడ, ఆగస్టు 26: ఉపాధి కోసం సుదూర ప్రాంతం నుంచి విజయవాడకు వచ్చి, నవజాత శిశువుతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ కూలీ కుటుంబానికి సత్యనారాయణపురం పోలీసులు ఆపన్నహస్తం అందించారు. మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతో పోలీసుల సేవా దృక్పథంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీ దంపతులు ఉపాధి కోసం విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. చేతిలో డబ్బులు లేకపోవడం, నవజాత శిశువుతో స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వారి పరిస్థితిని గమనించిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు విషయం సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు కూలీ కుటుంబానికి ఆహారంతో పాటు చిన్నారికి అవసరమైన పాల ఖర్చులను సమకూర్చారు. అదనంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.
అంతటితో ఆగకుండా దంపతులు నవజాత శిశువుతో సురక్షితంగా స్వగ్రామానికి చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసి రైలు ఎక్కించారు. కష్టాల్లో ఉన్న సమయంలో తమకు అండగా నిలిచిన పోలీసులకు కూలీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి మానవత్వంతో అండగా నిలిచిన సత్యనారాయణపురం పోలీసుల సేవా దృక్పథాన్ని పలువురు అభినందించారు.
