ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్.. భారీ ఊరట: ఎమ్మెల్యే రాము
విద్యుత్ సబ్సిడీపై జీవో 57 విడుదల.. పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది: వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటికి వినతి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
పాలకొల్లు: ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు భారీ ఊరట కలిగిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్వా రైతులకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సబ్సిడీని యూనిట్కు రూ.1.50గా అమలు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 57 విడుదల చేసిన నేపథ్యంలో పాలకొల్లులో బుధవారం రైతు కృతజ్ఞత సభ నిర్వహించారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ ప్రాంత ఆక్వా రైతులు సభకు హాజరయ్యారు.
సభలో మంత్రి నిమ్మల రామానాయుడు జీవో నంబర్ 57ను చదివి వినిపించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు జీవో ప్రతులను సభాముఖంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీ ద్వారా కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించినట్లయిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ఆదాయం అందించే రంగాల్లో ఆక్వా రంగం కీలకమైనదని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో 49 శాతం జీడీపీ ఆక్వా రంగం నుంచే వస్తోందని రాము పేర్కొన్నారు. కీలకమైన ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తూ రైతులకు రాయితీలు కల్పించడం అభినందనీయమన్నారు.
రొయ్యల ధరల స్థిరీకరణ కోసం గుడివాడ నియోజకవర్గంలో ఆక్వా డిజిటల్ పాజిబిలిటీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీతో పాటు రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
సభ అనంతరం గుడివాడ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే రాము మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడలో అవసరమైన విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, ధర్మరాజు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చార్రగడ్డ రవికుమార్, నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, కృష్ణాజిల్లా ఆక్వా రైతు సంఘం నాయకుడు కొల్లూరు సత్యనారాయణతో పాటు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు

