గుడివాడలో రూ.26.52 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు
గత రెండేళ్లలో రూ.14 కోట్ల పనులు.. మరో రూ.11 కోట్ల పనులు వివిధ దశల్లో... లో వోల్టేజ్ సమస్యలు, కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష... గత సమావేశంలో గుర్తించిన సమస్యల్లో 90 శాతానికి పైగా పరిష్కారం.. అధికారులకు అభినందన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 13: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై గురువారం ప్రజా వేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
గుడివాడ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ఎదురవుతున్న లో వోల్టేజ్ సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. కొత్త విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు, మరమ్మతుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
ప్రజా దర్బార్తో పాటు నియోజకవర్గ పర్యటనల్లో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన విద్యుత్ సమస్యలను రాము అధికారుల ముందుంచారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గత సమీక్షలో గుర్తించిన సమస్యల్లో 90 శాతానికి పైగా పరిష్కరించినట్లు అధికారులు వివరించడంతో ఎమ్మెల్యే వారి పనితీరును అభినందించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే గుడివాడ విద్యుత్ ఫీడ్బ్యాక్ ఒక శాతం మెరుగ్గా ఉందని అధికారులు వెల్లడించారు.
నియోజకవర్గంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, కొత్త ఫీడర్ల ఏర్పాటుపై విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డితో ఎమ్మెల్యే రాము ఫోన్లో చర్చించారు. విద్యుత్ సమస్యలను ఇప్పటికే మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి సానుకూలంగా స్పందించిన విషయాన్ని సీఎండీకి వివరించారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో గుడివాడ నియోజకవర్గంలో రూ.14 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో రూ.11 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, అదనంగా రూ.1.52 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
నందివాడ మండలంలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ వ్యవస్థ సరిగా లేని గ్రామాల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో ఫీడర్ల విభజన, అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఇంకా చేపట్టాల్సిన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
సమీక్ష సమావేశంలో ఎలక్ట్రికల్ డీఈ జి.బి.శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడీ బాపిరాజు, గుడ్లవల్లేరు ఏడీ కిరణ్, ఏఈలు ఉష, బ్రహ్మానందరావు, కుమార్, సూర్యప్రకాశ్, శ్యామలతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

