దండం పెట్టి.. దోచుకెళ్లాడు!
షట్టర్ ధ్వంసం చేసి దుకాణంలోకి ప్రవేశం... కుర్చీలో దర్జాగా కూర్చొని నగదు తీసుకెళ్లిన వైనం... రూ.30 వేల నగదు, ఇతర వస్తువులు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు...

ఉరవకొండ: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి చేసిన పని చూసి బాధితుడితో పాటు పోలీసులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. దుకాణంలోకి చొరబడిన దొంగ.. చోరీ ప్రారంభించే ముందు అక్కడున్న వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించి, ఆ తర్వాత నగదు దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి వివరాల ప్రకారం.. కుప్పంకు చెందిన మొగన్ ఉరవకొండ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన బిగ్ బజార్ నిర్వహిస్తున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తి దుకాణం షట్టర్ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు.
క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్న దొంగకు అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటం కనిపించింది. వెంటనే స్వామివారికి చేతులు జోడించి నమస్కరించాడు. అనంతరం అక్కడున్న కుర్చీలో దర్జాగా కూర్చొని క్యాష్ కౌంటర్లోని నగదును తీసుకొని వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.
రూ.30 వేల నగదుతో పాటు మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

