ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రికి ఎంపీలు లింగమనేని రమేశ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి... కొత్త జిల్లాలతో సహా జేఎన్వీలు లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి... 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు ప్రారంభించాలని కోరిన ఎంపీలు...

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం అందజేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా నవోదయ విద్యాలయాలు లేని అన్ని జిల్లాల్లో జేఎన్వీలను మంజూరు చేయాలని కోరారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
నవోదయ విద్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యావకాశాలకు దూరమవుతున్నారని ఎంపీలు వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
నవోదయ విద్యాలయ సమితి నిబంధనల మేరకు అవసరమైన భూమి, తాత్కాలిక భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వం, ఎంపీలతో ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు ద్వారా గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభించడంతో పాటు జాతీయ విద్యా విధానం–2020, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఎంపీలు పేర్కొన్నారు.

