ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ
విజయవాడ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించిన బొండా ఉమా... త్వరలో తేదీ ఖరారు చేయాలని పీఎస్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు... అక్టోబర్లోపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సానుకూల సంకేతాలు...

విజయవాడ, ఆగస్టు 5 (వి10టివి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఉండవల్లిలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా వన్-టు-వన్గా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ అభివృద్ధి, పేదల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
విజయవాడ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరుకావాలని బొండా ఉమా కోరగా, త్వరలోనే తేదీని ఖరారు చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, అక్టోబర్లోపు కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అలాగే డివిజన్ల పెంపు, మేయర్ను ప్రత్యక్షంగా ఎన్నిక చేసే విధానంపై కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
విజయవాడ నగర అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

