సుప్రీంకోర్టు జడ్జి పేరుతో సైబర్ మోసం.. మచిలీపట్నం మహిళకు రూ.1.43 కోట్ల టోకరా
ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి నమ్మించిన కేటుగాళ్లు... మనీలాండరింగ్ కేసు, నాన్బెయిలబుల్ వారెంట్ పేరుతో తీవ్ర భయాందోళనకు గురిచేసిన మోసగాళ్లు... కోర్టుకు డబ్బు ప్లెడ్జ్ చేయాలంటూ విడతల వారీగా రూ.1.43 కోట్లు బదిలీ చేయించిన సైబర్ నేరగాళ్లు...

మచిలీపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ):కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పరాస్పేటకు చెందిన వెంపటి అలవేలు మంగమ్మ అనే మహిళను ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారులు, సుప్రీంకోర్టు జడ్జి పేర్లతో నమ్మించి సైబర్ కేటుగాళ్లు రూ.1.43 కోట్లకు పైగా కాజేశారు.
బాధితురాలికి జూన్ 10న ఫోన్ చేసిన మోసగాళ్లు, ఆమె పేరుతో మనీలాండరింగ్ కేసు నమోదైందని, ఢిల్లీలోని కెనరా బ్యాంకు ఖాతా ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని, ఆమెపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని భయపెట్టారు. అనంతరం వీడియో కాల్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణ జరుగుతోందంటూ నకిలీ విచారణ నిర్వహించి, కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాల్లోని నగదును కోర్టుకు "ప్లెడ్జ్" చేయాలని సూచించారు.
వారి మాటలు నమ్మిన బాధితురాలు జూన్ 15 నుంచి విడతల వారీగా ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోని డిపాజిట్లను రద్దు చేసి ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం రూ.1.43 కోట్లకుపైగా వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు.
జూలై చివర్లో మరో రూ.95 లక్షలు చెల్లించాలని, లేదంటే ఆస్తులన్నీ సీజ్ చేస్తామని బెదిరించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అమెరికాలో ఉన్న కుమారుడికి విషయం చెప్పగా ఇది సైబర్ మోసమని గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
మోసగాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్, ఐఎంఓ యాప్ ద్వారానే మాట్లాడారని, తమ ముఖాలు ఎప్పుడూ చూపించలేదని బాధితురాలు వెల్లడించారు. ఎవరికి సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులను చంపేస్తామని కూడా బెదిరించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు, ఈడీ, సీబీఐ, కోర్టు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో డబ్బు కోరితే నమ్మవద్దని, వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
