వీఎంసీ మొబైల్ కోర్టు తనిఖీలు.. 23 మందికి జరిమానా
విజయవాడ VMC సర్కిల్-1 పరిధిలో ప్రత్యేక మొబైల్ కోర్టు నిర్వహణ. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు. మొత్తం రూ.6,750 జరిమానా విధించిన అధికారులు.

V10 TV | విజయవాడ
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) సర్కిల్-1 పరిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన 23 మందికి అధికారులు జరిమానాలు విధించారు.
రహదారులపై చెత్త వేయడం, ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రతకు విఘాతం కలిగించడం, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, ఇతర మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై తనిఖీలు చేపట్టిన అధికారులు మొత్తం రూ.6,750 జరిమానా వసూలు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు నగరంలో పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ కోసం మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, మొబైల్ కోర్టుల ద్వారా చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

