శ్రావణ మాసంలోనే దుర్గగుడిలో నూతన ప్రసాద భవనాల ప్రారంభం
లడ్డూ ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు. ఈవో శీనా నాయక్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం. ముహూర్తం ఖరారైన వెంటనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్న దేవస్థానం

V10 TV | విజయవాడ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన ప్రసాదం పోటు (లడ్డూ తయారీ కేంద్రం), అన్నప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం మొదటి లేదా రెండో వారంలో ఈ భవనాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాద విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.
ప్రారంభోత్సవ సమయానికి యంత్రాల పనితీరు, విద్యుదీకరణ, మౌలిక వసతులు, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సిద్ధంగా ఉండేలా విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
వేద పండితులు నిర్ణయించే శుభ ముహూర్తం ఖరారైన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ప్రారంభోత్సవ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఈవో శీనా నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో భక్తులకు నూతన భవనాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

