ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్.. ఎన్డీయే కార్యాలయానికి వెల్లువలా ప్రజలు..
భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్కు విశేష స్పందన... కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ... అర్హుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని కూటమి నేతల హామీ...

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ): పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, పత్తి నాగేశ్వరరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, జనసేన నాయకులు పల్లంటి ఆది, పులిచేరి రమేష్, ఏలూరు సాయి శరత్, బీజేపీ నాయకులు యర్రంశెట్టి విశ్వేశ్వరరావు, రుద్రపాటి వెంకటేష్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వైద్య సహాయం, స్థానిక మౌలిక సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలు అందజేశారు. ప్రతి వినతిని నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కూటమి నేతలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, దాడి అప్పారావు, యర్రంశెట్టి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
