విజయవాడ మేయర్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించాలి
కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి... ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా కాక రాజకీయ భాగస్వాములుగా చూడాలి... ఆంధ్రప్రదేశ్ స్టేట్ హిస్టరీ అకాడమీ మాజీ డైరెక్టర్ వాజిద్ ఖాన్ డిమాండ్...

విజయవాడ, సెప్టెంబరు 7: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హిస్టరీ అకాడమీ మాజీ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగర పరిధిలో కూటమి తరఫున ముస్లిం మైనార్టీ వర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కకపోవడం ఆ వర్గాల్లో నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సమాజం దశాబ్దాలుగా వ్యాపారం, విద్య, వైద్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో తన వంతు పాత్ర పోషిస్తోందని చెప్పారు. నగరంలో ముస్లిం మైనార్టీల జనాభా కూడా గణనీయంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమవుతుందని అభిప్రాయపడ్డారు.
మేయర్ పదవి ఒక వర్గానికే పరిమితమైనది కాదని, నగర ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే కీలక బాధ్యతాయుతమైన స్థానం అని వాజిద్ ఖాన్ పేర్కొన్నారు. కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సముచిత అవకాశాలు కల్పించే దిశగా కూటమి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ భాగస్వాములుగా గుర్తించి నిర్ణయాత్మక స్థానాల్లో అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ మేయర్ అభ్యర్థిత్వాన్ని ముస్లిం మైనార్టీకి కేటాయించడం ద్వారా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, సర్వమత సమానత్వంపై ప్రభుత్వం బలమైన సందేశం ఇవ్వగలదన్నారు.

