స్వాతి రోడ్డుపై ఆక్రమణల ప్రక్షాళన
ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది సంయుక్త చర్యలు... ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు... స్కూల్ వ్యాన్లను రోడ్డుపై నిలిపినందుకు సెయింట్ జాన్ స్కూల్కు పెనాల్టీ...

విజయవాడ, భవానీపురం: స్వాతి రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన వ్యాపారాలను తొలగించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణా నాయక్ ఆదేశాల మేరకు ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, ప్లానింగ్ సెక్రటరీలు హేమ, మహేష్ నాయక్, ప్రశాంత్ నాయక్, అమలేశ్వరరావు, యార్లగడ్డ మహేష్ తదితర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆక్రమణల తొలగింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ సహకారంతో చర్యలు కొనసాగించారు.
సెయింట్ జాన్ స్కూల్కు తగిన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో స్కూల్ వ్యాన్లను రోడ్డుపైనే నిలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్కూల్కు పెనాల్టీ విధించారు.
స్వాతి రోడ్డు నుంచి చర్చి సెంటర్ వరకు పలుచోట్ల రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు అందినట్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణా నాయక్ తెలిపారు. ఫిర్యాదు మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టామని, మిగిలిన వాటిపై కూడా తదుపరి చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు.

