సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ
ఆన్లైన్ ఆర్థిక మోసం జరిగిన వెంటనే అప్రమత్తమైతే నగదు ఫ్రీజ్కు అవకాశం... స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా చట్టాలను గౌరవించాలని పిలుపు... భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రి గస్తీ పెంచుతామని హామీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: సైబర్ మోసానికి గురైనప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లోనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని భవానిపురం ఎస్సై పిన్నింటి శివ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే బ్యాంకుల సహకారంతో మోసగాళ్ల ఖాతాలకు వెళ్లిన నగదును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భవానిపురంలోని కీప్ వెల్ పార్క్లో హెచ్ఐజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో ఎస్సై పి. శివ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, చట్టాలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలతో పాటు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు, సైబర్ వేధింపులు, హ్యాకింగ్, ఫొటో మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీవాసులు పార్కు పరిసరాల్లో పోకిరీల బెడద, భద్రతకు సంబంధించిన సమస్యలను ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ పెంచడంతో పాటు నిఘాను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు జె. ప్రసాదరావు, కార్యదర్శి జి. డేవిడ్ రాజు, జాయింట్ సెక్రటరీ డా. అశోక్ బాబు, వైస్ ప్రెసిడెంట్ శర్మ, ఎల్.వి. ప్రసాదరావు, సీహెచ్.ఎస్. రవికుమార్, సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ జె.ఎస్.కె. శ్రీనివాసాచారి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

