మహేంద్ర కుటుంబానికి సొంతింటి భరోసా
హత్యకు గురైన నాయి బ్రాహ్మణుడు మహేంద్ర కుటుంబానికి రెండు సెంట్ల నివాస స్థలం... ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో భార్య లక్ష్మి పేరుతో స్థలం కేటాయింపు... ఇంటి నిర్మాణానికీ ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ...

గుడివాడ, ఆగస్టు 25: ఒంగోలులో దారుణ హత్యకు గురైన గుడివాడకు చెందిన నాయి బ్రాహ్మణుడు గరిటెపల్లి మహేంద్ర కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో మహేంద్ర కుటుంబానికి రెండు సెంట్ల నివాస స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామంలో నివసిస్తున్న మహేంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే రాము ఇటీవల పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సొంత నివాస స్థలం కూడా లేకపోవడంతో ప్రభుత్వపరంగా అండగా నిలుస్తానని అప్పట్లో కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
మహేంద్ర కుటుంబ పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకెళ్లారు. కుటుంబానికి సొంత నివాసం కల్పించాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఆయన ఆదేశాలతో సిద్ధాంతం గ్రామంలోని జనావాసాల మధ్య మహేంద్ర భార్య లక్ష్మి పేరుతో రెండు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంగళవారం గుడివాడలోని ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కలిసి మహేంద్ర కుమార్తె మాధవి, కుమారుడు భరత్కు స్థలానికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మహేంద్ర కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత వారికి ప్రభుత్వపరంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కుటుంబానికి సొంతింటి స్థలం లేకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి స్థలం కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
కేవలం స్థలం కేటాయింపుతోనే సరిపెట్టకుండా ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని రాము భరోసా ఇచ్చారు. బీసీ వర్గాలకు చెందిన ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
మహేంద్ర కుటుంబానికి నివాస స్థలం కేటాయించడంపై కుటుంబ సభ్యులతో పాటు నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు మహేంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకుడు దేవరపల్లి కోటి, సంఘ నాయకులు వికృత్తి పోతురాజు, పాణేశ్వరరావు, శ్రీకాంత్, టీడీపీ నాయకుడు రెడ్డి షణ్ముఖతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

