విజయ డెయిరీపై భారీ కుట్ర: పేర్ని నాని
▪️ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణ... ▪️ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శ... ▪️ సహకార సంఘాల ఆస్తులను అక్రమార్కుల పాలు కానివ్వమని హెచ్చరిక...

V10TV – కృష్ణాజిల్లా, మచిలీపట్నం
విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ డెయిరీని దెబ్బతీసి దాని విలువైన ఆస్తులను హస్తగతం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
సహకార సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని హెరిటేజ్ ప్రయోజనాల కోసం నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్ని నాని ఆరోపించారు. మండవ జానకిరామయ్య బాటలో చలసాని ఆంజనేయులు విజయ డెయిరీ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని చెప్పారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో విజయ డెయిరీ బలమైన సంస్థగా ఎదిగిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో మండవ జానకిరామయ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ అభివృద్ధి పథంలో నడిచిందని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహకార రంగంలోని డెయిరీల అభివృద్ధికి కృషి జరిగిందన్నారు.
చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ‘రెడ్ బుక్’ రాజకీయాలు ఉన్నాయని పేర్ని నాని ఆరోపించారు. సహకార సంఘ సభ్యుల ద్వారా ఎన్నికైన చైర్మన్ను పదవి నుంచి తప్పించేందుకు మంత్రులకు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులుపై ఇద్దరు మంత్రులు ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని ఆరోపించారు. రాజీనామా చేయకుంటే కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆయన ఆరోపించారు.
కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగానే చలసాని ఆంజనేయులు అనారోగ్యానికి గురయ్యారని పేర్ని నాని పేర్కొన్నారు. విజయ డెయిరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని ఆరోపించారు.
సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని అక్రమార్కుల పాలు కానివ్వబోమని పేర్ని నాని స్పష్టం చేశారు. విజయ డెయిరీ విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని భవిష్యత్తులో చట్టపరంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

