డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో
ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ విద్యార్థులారా.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని పిలుపు విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి.. మాదకద్రవ్యాలు కాదు.. విద్యార్థి భవిష్యత్తే దేశ భవిష్యత్తని ఏఐఎస్ఎఫ్ నాయకులు

విజయవాడ: “డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో” అంటూ విద్యార్థులు నినదించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్లోని ట్రెండ్సెట్ మాల్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. “విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి.. మాదకద్రవ్యాలు కాదు”, “విద్యార్థి భవిష్యత్తే దేశ భవిష్యత్తు”, “డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు”, “సైబర్ నేరగాళ్ల వలలో పడకండి” అంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు, మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనేపూడి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న లక్నోలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ దేశంలో ఏర్పడిన తొలి జాతీయ విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కులు, విద్యా పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువత, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. రాజశేఖర బాబు చేపడుతున్న కార్యక్రమాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు అభినందించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ వంతు బాధ్యత తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు ముందుండాలని, చదువుతోనే తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.
