నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ
ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం: సుజనా చౌదరి కీలక శాఖల మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర ఆయురారోగ్యాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV గుంటూరు, ఆగస్టు 13: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నిబద్ధత కలిగిన నాయకుడని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొనియాడారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కన్నా ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాసేవకు అంకితమయ్యారని ప్రశంసించారు.
కన్నా లక్ష్మీనారాయణ జన్మదినంతో పాటు ఆయన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి కన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. యువకుడిగా ఉన్న సమయంలో పోలీసు అధికారి కావాలని కన్నా భావించారని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారని ప్రశంసించారు. నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచే వ్యక్తిత్వం కన్నా సొంతమన్నారు.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని సుజనా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల విషయంలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయమన్నారు.
కన్నా లక్ష్మీనారాయణకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరింత కాలం ప్రజలకు సేవ చేసే శక్తిని అందించాలని ఆకాంక్షించారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సేవలను సుజనా చౌదరి అభినందించారు.

