సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పవన్కిషోర్
ఇంపల్స్ బాయ్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన... నకిలీ ఉద్యోగాలు, లాటరీలు, కేవైసీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన... మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 22: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని పటమట సీఐ పవన్కిషోర్ సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయడం, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిడమనూరులోని ఇంపల్స్ బాయ్స్ జూనియర్ కళాశాలలో శనివారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరుకుళ్ల రమేష్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో పటమట సీఐ పవన్కిషోర్, ఎస్ఐ అనూష, సైబర్ క్రైమ్ సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ లోవరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ పవన్కిషోర్ మాట్లాడుతూ నకిలీ ఉద్యోగ ప్రకటనలు, లాటరీలు, రివార్డుల పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దన్నారు. బ్యాంకు ఖాతా నిలిపివేస్తామంటూ వచ్చే ఫోన్కాల్స్, కేవైసీ అప్డేట్ పేరుతో పంపే అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని, డిజిటల్ లావాదేవీల సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

