బతికుండగానే ‘డెత్ సర్టిఫికెట్’.. తాడిగడపలో కలకలం!
వితంతు పెన్షన్ కోసం భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు ఆరోపణలు.. ‘చనిపోయిన’ వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బయటపడిన వ్యవహారం.. అధికారుల తీరుపై విమర్శలు... మరికొన్ని ధ్రువపత్రాల జారీపైనా ఆరోపణలు.. ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం...

తాడిగడప: బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తూ మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు తాడిగడప మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వితంతు పెన్షన్ పొందేందుకు భర్త జీవించి ఉండగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
రికార్డుల ప్రకారం మరణించినట్లు పేర్కొన్న వ్యక్తి అనూహ్యంగా ప్రత్యక్షం కావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ధ్రువపత్రం ఏ ఆధారాలతో జారీ చేశారు? దరఖాస్తును ఎవరు పరిశీలించారు? క్షేత్రస్థాయి ధ్రువీకరణ జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవల భూ రిజిస్ట్రేషన్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పలు అనుమానాస్పద ధ్రువపత్రాలు జారీ చేసినట్లు మున్సిపాలిటీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
విచారణలో నకిలీ ధ్రువపత్రాల జారీ లేదా అధికారుల ప్రమేయం నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆరోపణలపై సంబంధిత మున్సిపల్ అధికారుల అధికారిక వివరణ రావాల్సి ఉంది.

